Friday 25 April 2014

చంద్రబాబు 'చారిత్రక' ముచ్చట్లు..!


'' మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పు చేశాను...''
- 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు ప్రకటన
'' బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం చారిత్రక అవసరం... ''
- 2014 ఎన్నికల ముందు చంద్రబాబు తాజా ప్రకటన
చంద్రబాబు మాటలు నమ్మాలా..? వద్దా..?? ఆయన చెప్పేవి అక్షర సత్యాలా..? జనాన్ని మోసం చేసే అసత్యాలా..??
అనేవి తెలుసుకోవడానికి పై మాటలు చాలవా..?!!
మోడీ-చంద్రబాబు ఓ జట్టట..!
హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ''మా ఇద్దరిదీ ఒక జట్టు'' అన్నారు. నిజమే.. కాదని ఎవరన్నారు..? వీరిద్దరిదీ ఖచ్చితంగా ఒక్కటే జట్టు..! మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు పొందడానికి, గుజరాత్ నమూనా పేరుతో శుద్ధ అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రధాని పీఠం దక్కించుకోవడానికి ఆరాటపడుతున్న వ్యక్తి ఒకాయన. ప్రజాసంక్షేమాన్ని నిర్వీర్యం చేసి, రాష్ట్ర విభజన విషయంలో రెండు పాటలు పాడి, ఇప్పుడు.. రెండింటా అధికారం దక్కించుకోవడానికి అర్రులు చాస్తున్న వ్యక్తి మరొకాయన.. వీరిద్దరిలో కామన్ అంశాలు..'' అబద్ధాలు చెప్పడం.. అధికారం కోసం నానాగడ్డి కరవడం..'' మరి.. ఈ విధంగా చూసుకున్నప్పుడు వీరిద్దరిదీ ఒకే జట్టు కాదని ఎలా అనగలం..?!
అవినీతిని తరిమికొట్టే శక్తి మోడీకే ఉందట..!!
అవునా..? మరి.. 2011-12లో రూ. 1,275కోట్లను కార్పొరేట్ కంపెనీలకు గుజరాత్ సర్కారు అప్పనంగా కట్టబెట్టిందని, ఈ నజరానాలు స్వీకరించిన వారిలో ఆదాని, ఎస్ఆర్, లార్సాన్ అండ్ టుబ్రో మొదలైన బడా కంపెనీలున్నాయని, ఈ బాగోతంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని సాక్షాత్తూ కాగ్ బయటపెట్టిన వాస్తవాలన్నీ చంద్రబాబు దృష్టిలో అవాస్తవాలా..?! బహిరంగ మార్కెట్ లో మూడు వేల రూపాయలు పలుకుతున్న చదరపు మీటరు స్థలాన్ని అతి దారుణంగా ఒక్కటంటే ఒకే ఒక్క రూపాయికి ముంద్రాపోర్టుకు, సెజ్ లకు కట్టబెట్టిన వైనాన్ని చంద్రబాబు దృష్టిలో అవినీతి అనరుకాబోలు. బాబు మాటల్లో ''ఇచ్చి పుచ్చుకోవడం అనుకుంటా..''
తెలంగాణకు మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తడట..!!!
 ఈ పదం విన్న తర్వాత ఒక సందేహం కలుగుతోంది..! చంద్రబాబు దృష్టిలో ప్రజలు మరీ అంత వెర్రివాళ్లలాగా.. ఎప్పటి సంఘటన అప్పుడే, వెంటనే మరిచిపోయే గజినీల్లాగా కనిపిస్తున్నారా..?! అర్థం కావట్లేదు. ఈయన ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టిన సమయంలో (2000 సంవత్సరం) విద్యుత్ కోసం ఉద్యమించిన వారిపై పోలీసులను ఉసిగొల్పి, భాష్పవాయు గోళాలతో దండెత్తి, వాటర్ కేనన్లు ప్రయోగించి, లాఠీలతో ఉద్యమకారులను కుళ్లబొడిచి, చివరకు.. అత్యంత దారుణంగా తుపాకీ గుళ్ల వర్షం కురిపించి, ముగ్గురిని బలితీసుకున్నారు. అలాంటి వ్యక్తి .. నేడు అదే విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు.. ప్రజలు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొస్తున్నారు.. అందువల్ల తనను అధికారంలో కూర్చోబెడితే.., మీకు నాణ్యమైన, అవసరమైన, కొరతలేని, కోత లేని విద్యుత్ ఇస్తానంటూ ముచ్చట చెబుతున్నాడు. అంటే.. నాటి విధ్వంసాన్ని చంద్రబాబు గారు మరిచిపోయినట్లుగా.. ప్రజలు కూడా మరిచిపోయి ఉంటారని భావిస్తున్నట్లున్నారు. పాపం హైటెక్ మాజీ ముఖ్యమంత్రి..!
దేశం.. చైనా, అమెరికాలను మించిపోతుందట..!!!
 ''ఆపరేషన్ దుర్యోధన'' సినిమాలో రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన హీరో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ''హైదరాబాద్ కు ఓడరేపు తెప్పిస్తానని హామీ ఇస్తున్నా..'' అంటాడు. సభికుల్లోని ఓ వృద్ధుడు స్పందిస్తూ.. ''హైదరాబాద్ లో సముద్రం లేదురా సన్నాసి.. ఓడరేవు ఎలా తెస్తావురా..?'' అంటే.. ''అలాగా.. అయితే హైదరాబాద్ కు సముద్రాన్ని కూడా తెప్పిస్తానని సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా..'' అంటాడు. అచ్చం ఇదే విధంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు. భారత దేశం చైనా, అమెరికాలను మించిపోతుందని బాబు చెప్పేశాడు. కానీ.. అది ఎలా సాధ్యం..? ఇప్పటి వరకూ దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ అనుసరించిన విధానాలనే మరింత బలంగా అమలు చేస్తానని మోడీ చెప్తున్నాడు. అంతే తప్ప, కొత్త విధానాలు అమలు చేస్తాననే మాట ఎక్కడా చెప్పట్లేదు. అంటే.. తాను అధికారంలోకి వస్తే.. ఇప్పటి వరకూ దేశ ప్రజలు అనుభవించిన కష్టాలు మరింత రెట్టింపు అవుతాయని మోడీ చెప్పకనే చెప్తున్నాడు. మరి.. అలాంటప్పుడు దేశ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది..? చైనా, అమెరికాలను ఎలా దాటుతుంది..?? ఇది హైటెక్ బాబుకు తెలియదా..? తెలిసి కూడా ఓట్ల కోసం జనాన్ని మోసం చేస్తున్నారా..?? ప్రజలే అర్థం చేసుకోవాలి.

1+1+1 = 111 (అరె బై.. గిదేం లెక్క..?!)

Narendra Modi

హైద్రాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిండు. తెలంగాణ ప్రజల నుంచి ఓట్లు రాల్చుకోవడానికి ఆయన పడిన తాపత్రయం మొత్తం ఆయన మాటల్లనే కనపడ్డది.. తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీ ఎన్నో పోరాటాలు చేసిందని, తెలంగాణ ఏర్పడేదానికి తమ పార్టీ చిత్తశుద్ధితో కృషి జేసిందని చెప్పుకొచ్చారు. మళ్లీ వెంటనే.. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అనే తల్లిని చంపేసింది, ఇది చాలా దుర్మార్గం, అన్యాయం అని మొత్తుకోవడం మొదలు పెట్టారు. అయితే.. తల్లిని చంపేందుకు అవసరమైన కత్తిని అందించింది తామేనని మాత్రం అనకుండా జాగ్రత్తపడ్డారు.. గిట్ల కిరాక్ కిరాక్ గా మాట్లడుతున్న మాటలతోనే సభకు హాజరైన జనాలు బుర్రగోక్కుంటుడగా.. మరో తిక్క'లెక్క' ఒకటి వదిలారు...
1+1+1 = 3 కాదట..! 1+1+1 = 111
 ''మూడు ఒకట్ల మూడు కాదు.. నూట పదకొండు అన్నడు..''! ఇది విన్న జనాల బుర్ర గిర్రుర్రుర్రు...న తిరిగింది. మరోసారి గిదే లెక్క చెప్పిండు.. అర్రే.. ఒకటో తరగతి సదువుతున్న పిల్లగాన్ని అడిగినా.. అమెరికా ప్రెసిడెంటు ఒబామాను అడిగినా.. చివరకు.., సచ్చిపోయి నరకంలో ఉన్నడో, స్వర్గంలో ఉన్నడో.. యాడున్నడో తెల్వదుగానీ.. ఒసామా బిన్ లాడెన్ ను అడిగినా... 1+1+1 = ఎంత..? అంటే '3' అంటరు. కానీ.. గీయనేంది..? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నడు, దేశానికి ప్రధాన మంత్రి అవుతానంటున్నడు.. ఇలాంటాయనకు మూడు ఒకట్లు ఎంతో తెల్వదా..? రామచంద్రా ఇదెక్కడి చోద్యం..?! అంటూ కొంతమంది ముక్కుమీద వేలేసుకోబట్టె.
మాజీ ముఖ్యమంత్రి అంజయ్య దళితుడట..!!
 మోడీజీ.. పైన పేర్కొన్న పైత్యం నుంచి తేరుకోకుండానే మరో అజ్ఞాన బాణం విసిరిండు. తెలంగాణ నేతలను ప్రస్తావించడం ద్వారా.. ఇక్కడి ప్రజలు మనసు గెలుచుకోవాలని భావించిన మోడీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అంజయ్యను కాంగ్రెస్ నేతలు అవమానించారని, దానికి కారణం.. ఆయన దళితుడు కావడమేనని అనేశారు. ఇది విన్న సభికులంతా.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అంజయ్య.. దళితుడిగా ఎప్పుడు మారాడబ్బా..? అని ఆలోచనలో మునిగిపోయిండ్రు. తెలియనప్పుడు.. తెలియనట్లుండాలిగానీ.. గివేం.. తెలివితక్కువ మాటలు..? అంటూ కొందరు చెవులు కొర్కున్నరు.
ఇదేం మొదటిసారి కాదు...
 తనకు తెలియని విషయాల గురించి మాట్లాడుతూ.. పప్పులో, ఉప్పులో కాలేయడం మోడీ ఇదేం మొదటిసారి కానే కాదు. గతంలోనూ చాలా సార్లు ఇలా తెలియని విషయల్లో తనకేదో తెలివితేటలున్నట్లు మాట్లాడి అభాసుపాలయ్యారు. పాట్నా ర్యాలీలో ప్రసంగించినప్పుడు బీహారీలకు మస్కా కొట్టాలనే ఆరాటంలో.. ''విశ్వవిజేత అలెగ్జాండర్ ను ఓడించిన ఘనత బీహారీలదే..'' అనేశాడు. అయితే.. ఈ విషయం తెలియని వారు. ఆహా.. ఓహో.. అని చప్పట్లు కొట్టగా.. విద్యావంతులు మాత్రం.. ''నీ తెలివి తగలెయ్య..'' అని నెత్తిబాదుకున్నరు. ఎందుకంటే.. అలెగ్జాండర్ గంగానది దాటి బీహార్ లోకి అడుగు పెట్టనే లేదు. ఈ విషయం తెలియకుండా చప్పట్ల కోసం ఆరాటపడి, నవ్వుల పాలయ్యాడు మోడీ. అదేవిధంగా.. తక్షశిల గొప్పతనాన్ని పొగుడుతూ.. అది బీహార్ లో ఉండడం ఎంతో గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు. కానీ.. వాస్తవం ఏంటంటే.. తక్షశిల ప్రస్తుత పాకిస్థాన్ లో ఉంది. ఈ విధంగా తెలియని విషయాల్లోనూ తనకు ఎంతో ప్రజ్ఞ ఉందని చాటుకోవడం కోసం ప్రయత్నించడం.. తప్పులు మాట్లాడడం.. దెబ్బైపోవడం మోడీకి ఒక అలవాటుగా మారింది.
పోల్ సర్వేలన్నీ ఒట్టివే...
 పైన చెప్పుకున్న అన్ని విషయాల్లోనూ తప్పులు మాట్లాడిన మోడీ.. హైదరాబాద్ సభలో ఒక్క నిజం చెప్పారు. అదే.. ఎగ్జిట్ పోల్స్ గురించి. రాజకీయ విశ్లేషకులు ఏసీ గదుల్లో కూర్చొని లెక్కలు వేస్తుంటారని, అవన్నీ చిత్తుకాగితాలతో సమానం అని అన్నారు. ఇప్పటి వరకూ వచ్చిన పోల్ సర్వేలన్నీ నిజాలు కావని, వాటి ఊహకు అందని విధంగా ఫలితాలు వస్తాయని చెప్పారు. అంటే.. బీజేపీకి అధిక సంఖ్యలో సీట్లు వస్తాయని ఊదరగొట్టిన సర్వేలన్నీ వట్టి మాటలేనని మోడీ తేల్చేశారు. కాబట్టి.. మోడీ గాలి వీస్తోందని, బీజేపీ హవా సాగుతోందని చెప్తున్నవన్నీ సొలు కబుర్లేనన్న విషయం నిజమేనని మోడీ ఒప్పేసుకున్నారన్నమాట..!

'తిక్క' ముదిరింది..!

Pawan Kalyan praises Modi 

''దేశ సమగ్రతను దెబ్బ తీసేలా కుల, మత, ప్రాంతీయపరంగా కొందరు మాట్లాడుతున్నారు. వారిని నరేంద్ర మోడీ క్షమించరు.'' - పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు
ఈ మాటలు చాలవా.. పవన్ కళ్యాణ్ కు తిక్క ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి..?!
మతాన్ని రెచ్చగొట్టేదెవరో తెలీదా..?
ఈ దేశంలో మతమే ఎజెండాగా ముందుకు సాగుతున్న పార్టీ బీజేపీ అన్న విషయం రాజకీయాలపై ఏ కొద్దిపాటి అవగాహన ఉన్న వారికైనా తెలిసిన విషయం. మరి.. పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలియదా..? ఆ మాత్రం అవగాహన లేకుండానే పార్టీ పెట్టేశాడా.?? లేక.. అంతా తెలిసి కూడా, మతోన్మాద పార్టీకి మేలు చేయాలనే ఉద్దేశంతో.. ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడా..??? బాబ్రీ మసీదు విధ్వంసం.. గుజరాత్ లో ముస్లింల ఊచకోత.. ముజఫర్ నగర్ హింస.. హైదరాబాద్ పాతబస్తీ అల్లర్లు.. ఇవన్నీ పవన్ మరిచిపోయినట్లున్నాడు. ఇవన్నీ గత అనుకుంటే.. మొన్నటికి మొన్న మోడీకి అత్యంత సన్నిహితుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ''ముస్లింలపై ప్రతీకారం తీర్చుకోవాలి'' అని రెచ్చగొట్టేలా మాట్లాడడం.. వాటిని పవన్ దృష్టిలో బలమైన నేత అయిన నరేంద్ర మోడీ బలపర్చడం జరిగిపోయాయి. అంటే.. ముస్లింలపై దాడులకు సైతం వెనుకాడబోమని నరేంద్ర మోడీ చెప్పకనే చెప్పారు. మరి.. ఈ సంగతి పవన్ కళ్యాణ్ కు తెలియదా..?
'ప్రాంతీయ' పాపంలో బీజేపీకి భాగం లేదా..?
 
పార్టీ ఆవిర్భాయ ప్రసంగంలో రాష్ట్ర విభజన పాపాన్ని ఒక్క కాంగ్రెస్ పై నెట్టేసిన పవన్ కళ్యాణ్.. అందుకు సహకరించిన బీజేపీని ఒక్క మాట కూడా అనలేదు. కానీ.. హైదరాబాద్ లో జరిగిన టిడిపి-బిజెపి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సహకరించిందని చెప్పుకొచ్చారు. అంటే.. 'ఏ ఎండకు ఆ గొడుగు' అన్న చందంగా.. ఎక్కడ ఎలాంటి మాటలు అవసరమైతే.. పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడుతారనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా..?!
మోడీ మూడు.. సర్కార్ నాలుగు.. అయినా...
 
''గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు ఎన్నికై రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు.. బలమైన ఈ దేశాన్ని పాలించాలంటే.. మోడీ లాంటి బలమైన నేత కావాలి..'' అంటున్నాడు పవన్ కళ్యాణ్. మోడీ భ'జనసేన' అధ్యక్షుడిగా కీర్తి గడించిన ఈయనకు.. మోడీ తప్ప మరెవరూ కనిపిస్తున్నట్టు లేదు. త్రిపుర ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సర్కార్ వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. ఎన్నికలో మోడీ కన్నా ఒక మెట్టు ఎక్కువే ఉన్న సర్కార్.. అవినీతికి ఆమడదూరంలో ఉంటారు. దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రి. కేవలం నెలకు 5 వేల వేతనంతో బతుకు బండి లాగిస్తున్న నిజమైన ప్రజానాయకుడు. తనదైన లీడర్ షిప్ తో త్రిపురను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. ఇన్ని క్వాలిటీలు కలిగిన మాణిక్ సర్కార్ కు పవన్ కళ్యాణ్ కళ్లకు ఎందుకు కనిపించట్లేదో..? దీనికి ఆయనే సమాధానం చెప్తే బాగుంటుంది.
దేశ సమగ్రతకు బీజేపీ ఎలా పాటుపడుతుంది..??
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడంలో బీజేపీకి పాత్ర ఉండడమే కాదు.. గతంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే హయాంలోనే జరిగాయి. ఇంకా.. అనేక రాష్ట్రాలను విడదీయాలనే ప్రణాళికను బీజేపీ రూపొందించింది. ''చిన్న రాష్ట్రాలు - బలమైన కేంద్రం'' అన్న నినాదంతో దేశాన్ని అరవై రాష్ట్రాలుగా విభజించాలని ఆ పార్టీ కంకణం కట్టుంది. అలాంటి పార్టీ చేతిలో దేశాన్ని పెడితే దేశ సమగ్రత మూడు పూలు ఆరు కాయలు అన్న చందంగా వెలుగుతుందని తాను నమ్మడమే కాకుండా.. జనులంతా నమ్మండని చెప్తున్న ఈ పవన్ కళ్యాణ్ ను ఏమనాలి..? పై పరిణామాలన్నీ గమనిస్తుంటే.. పవన్ కళ్యాణ్ లెక్కుందని చెప్పుకుంటున్న తిక్కకు లెక్కే లేదని, ఆ తిక్క దారుణంగా ముదిరిపోయిందని అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు..