KVP Ramachandra |
ఏమిటీ టైటానియం..?
టైటానియం అనేది ఒక లోహం.. ఇనుప గనుల్లోంచి ఇనుము తీసినట్లు.. సముద్ర తీర ప్రాంతం నుండి టైటానియం అనే లోహాన్ని తీస్తారు. దీనిని విమానాలు, జలాంతర్గాములు, క్షిపణుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. అంతేకాదు.. కృత్రిమ అవయవాలు, మొబైల్ ఫోన్లు, క్రీడా వస్తువులు, ఆభరణాల తయారీలోనూ టైటానియం ఎక్కువగా ఉపయోగిస్తారు.
రూ.111 కోట్ల ముడుపులు..
అమెరికా 'టైటానియం'ను వ్యూహాత్మక లోహంగా పరిగణించి దీన్ని స్టోర్ చేసుకోవడం ప్రారంభించింది. దీంతో ఈ లోహం విలువ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో.. మన రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతాల నుండి టైటానియం వెలికితీసేందుకు.. వాటిని విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006 ఏప్రిల్ 18న 'బెత్లీ' అనే సంస్థతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా విదేశీ కంపెనీల నుండి మన రాష్ట్ర 'పెద్దల' కు రూ.111 కోట్ల ముడుపులు అందాయని... డిఎఫ్ (దిమిత్రి ఫిర్టాష్) గ్రూపు అనుబంధ సంస్థలు ఈ ముడుపులు వీరికి అందజేశాయని.. ఎఫ్ బిఐ తేల్చింది.
ప్రధాన నిందితులు ఆరుగురు...
ఈ ముడుపుల భాగోతంలో ప్రధానంగా ఆరుగురు నిందితుల పేర్లను ఎఫ్ బి ఐ బయటపెట్టింది. ఇందులో.. మన రాష్ట్రానికి చెందిన, వైఎస్ ఆత్మ బంధువైన కేవీపీ ఉన్నారు. ఈయనతో పాటు డిఎఫ్ గ్రూపు కంపెనీల అధినేత దిమిత్రి ఫిర్టాష్, హంగేరీకి చెందిన వ్యాపార వేత్త ఆండ్రాస్ నోప్, అమెరికాలో స్థిరపడిన భారతీయుడు గజేంద్రలాల్, శ్రీలంకకు చెందిన పెరియస్వామి, ముడుపుల సమన్వయ కర్తగా వ్యవహరించిన సురెన్ జెవోర్జియాన్ పేర్లను ప్రధానంగా పేర్కొంది. వీరితో పాటు.. ఎపిఎండిసి ఎండి రాజగోపాల్ , మిస్టర్ 'సి' ఈ కుంభకోణంలో పాలు పంచుకున్నట్లు తెలిపింది. ఇంతకీ ఈ మిస్టర్ 'సి' ఎవరనేది ఇంకా స్పష్టం కాలేదు.
కేవీపీ విషయంలో స్పందించని ప్రభుత్వం..
ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉక్రెయిన్ వ్యాపారవేత్తను ఆ దేశ ప్రభుత్వం మార్చి 12, 2014న అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన రూ.1000 కోట్ల పూచీకత్తుపై విడుదల కావాల్సి వచ్చింది. కానీ మనదేశ ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఈ విషయంలో సరిగ్గా స్పందించలేదు. టైటానియం కుంభకోణానికి సంబంధించిన నిందితులలో రాజ్యసభ ఎంపి కేవీపీ ఉన్నప్పటికీ ఈ ఘటనపై విచారణ జరిపే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం విచారణ పూర్తిచేసి.. కేవీపీ అరెస్టుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment